అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

20 Apr 2016

సంగీతం పలికే శిల్పాలను చెక్కడమే కవిత్వం

ముందుమాట :

బూర్ల వెంకటేశ్వర్లు కవితాసంపుటి 'బాయి గిర్కమీద ఊరవిశ్క '

Add caption
’’పెద్దకచ్ఛురం‘‘ కవిత్వ సంపుటితో తెలుగు కవిత్వంలో ఒక సునామీలా వచ్చిన బూర్ల వెంకటేశ్వర్లు అప్పట్లోనే తెలంగాణా పల్లె బతుకులను పదచిత్రాల్లో ఆవిష్కరించి తెలంగాణా జీవనవైవిధ్యాన్ని కవిత్వీకరించాడు. తెలంగాణా స్ధానికత, తెలంగాణా స్పృహ, తెలంగాణా  పోరాటస్ఫూర్తితో తొణికిసలాడే ఆయన కవిత్వం ’’నేను నా గడ్డకోసం పోరాడతానని‘‘ నిర్మొహమాటంగా మొదటి సంపుటిలోనే ప్రకటించింది. తెలంగాణా అస్తిత్వం ధ్వనించే కవితలకు మరోపేరుగా బూర్ల వెంకటేశ్వర్లు మొదటి కవిత్వ సంపుటిలోనే గుర్తింపు పొందారు. ఇప్పుడు ’’బాయి గిర్క మీద ఊర విష్క‘‘‘ కవిత్వ సంపుటితో మరోసారి తన ప్రత్యేకతను చాటి చెప్పుకున్నాడు.

ఈ మొత్తం కవిత్వ సంపుటిలో తెలంగాణా మట్టి వాసన పరిమళిస్తోంది. తెలంగాణా పోరాటస్ఫూర్తి, గుర్తింపు కోసం తపన, అస్తిత్వ వేదన, తెలంగాణా పల్లెజీవన చిత్రం, తెలంగాణా భాష విశిష్టత పట్ల అపారమైన శ్రధ్ధ, అన్యాయాల పట్ల ఆగ్రహం ప్రతిబింబిస్తున్నాయి.
కవిగా బూర్ల వెంకటేశ్వర్లు ప్రత్యేత, ఆయన తన గడ్డను కవిత్వీకరించాడు. తెలంగాణా పోరుకు కవి ప్రతినిధిగా నిలబడ్డాడు. తెలంగాణా ఆత్మగౌరవానికి అక్షర హారతులిచ్చాడు. తెలంగాణా పల్లెల అందాన్ని, పల్లెపట్టుల మట్టి సౌరభాన్ని, శ్రమైక జీవన సౌందర్యాన్ని, తెలంగాణా ప్రజల సరళ జీవన ప్రతిబింబాన్ని తెలంగాణా భాషలో కవిత్వీకరించిన కవిగా ఆయన పేరు పొందాడు.ఆకుపచ్చ గుండె కవితలో ఈ ఆర్థ్రమైన కవిత్వసృజన కంటిలో పల్చని నీటి తెరను అల్లుతుంది.

’’ పల్లె ఎంత నిర్మలంగా….
మక్కజొన్నకంకి మీద మంచు బిందువులా
బావిగిలక మీద వాలిన పిచ్చుకలా
వాకిట్లో కోడిపిల్లలా పలకరిస్తది.‘‘
అంటూ తెలంగాణా పల్లెని వర్ణించడంలో వాడిన పదచిత్రాలు గుండెల్లో గూడుకట్టుకుంటాయి. అద్భుతమైన పదచిత్రాలు, ప్రతీకలతో నడిచే స్వచ్ఛమైన కవిత ఇది.
 చిత్రకారుడికి కవికి తేడా ఏమిటి?
ఇద్దరు కళాకారులే. ఒకరు రంగులతో బొమ్మలు వేస్తారు. మరొకరు అక్షరాలతో బొమ్మలు వేస్తారు? ఇద్దరు వేసేవి బొమ్మలే.
ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది.
చిత్రకారుడు కన్ను చూడగలిగిన బొమ్మలను మాత్రమే వేస్తాడు. ఒక కవి కంటిముందు వర్ణచిత్రాలను ప్రదర్శించడమే కాదు, మనోనేత్రాలు మాత్రమే దర్శించగలిగే అనుభూతి చిత్రాలను అందంగా వేయగలడు.
ఒక భావాన్ని చెక్కడం,  శిల్పంగా మలచడం కవి చేసే అద్భుతం. ఒక శిల్పి ఇలాంటి శిల్పాన్ని చెక్కలేడు. శిల్పి కేవలం అందమైన విగ్రహాన్ని మాత్రమే చెక్కగలడు. కవి అద్భుతమైన భావాన్ని చెక్కగలడు.
మనిషి భాషను కనుక్కున్నప్పుడే భావశిల్పాలను చెక్కే విద్య కూడా నేర్చుకున్నాడు. మనసు విరిగిపోయిందంటాడు. కంటికి కనిపించని మనసు విరిగిపోయిన ముక్కల్ని వినేవాడు చూస్తాడు. భాష కేవలం సమాచార మార్పిడి సాధనం మాత్రమే కాదు. అనుభూతుల ప్రసారానికి ఉపకరించే పనిముట్టు.
భాషను ఉలిలా ఉపయోగించే సామర్థ్యం, భాషను కుంచెలా వాడుకునే నేర్పరితనం ఉన్నవాడే కవి.
భాష కవికి పనిముట్టు మాత్రమే. భాషపై అద్భుతమైన పాండిత్యం  ఉన్నంత మాత్రాన గొప్ప కవిత్వం రాయడం సాధ్యం కాదు. కొన్ని మనోభావాలు, భావావేశాల అభివ్యక్తికి భాష సరిపోదు. భాషకు అందని భావాలను ప్రకటించడానికి భాషలో ప్రాణంపోసి దానిలో ఉదాత్తమైన, ఉత్తమస్థాయి భావప్రకటనా సామర్థ్యాన్ని నింపేవాడే కవి.
బూర్ల వెంకటేశ్వర్లు అలాంటి అద్భుత సామర్థ్యం ఉన్న అతికొద్ది మంది కవుల్లో ఒకరు. వెంకటేశ్వర్లు రాసిన ’’బాయి గిర్క మీద ఊర విష్క‘‘ కవిత్వ సంపుటి ఏకబిగిన మొత్తం కవితలన్నీ చదివించే సంపుటి.
అసలు కవి ఎందుకు రాస్తాడు? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఆలోచించదగింది. సాధారణంగా రచయితలు కానీ, కవులు కానీ బాహ్య, వైయక్తిక ప్రేరణల వల్ల రాస్తారని అనుకుంటాం. సమాజంలో కవి తాను చూసిన, తాను అనుభవించిన పరిస్థితులపై ప్రతిస్పందనలను అక్షరబద్దం చేస్తాడు. ఇది బాహ్య ప్రేరణ అనుకుంటే, మానసికంగా, వ్యక్తిగతంగా కవి అంతరాంతరాల్లో కదలాడే అనుభూతులు, భావావేశాలు వైయక్తిక ప్రేరణతో అక్షరబద్దం అవుతుంటాయి. అందుకే శివమెత్తిన మనిషి మాదిరిగా ఒక్కోసారి కలం కదం తొక్కుతుంది.
బూర్ల వెంకటేశ్వర్లు కవిత్వంలో వ్యక్తిగత మానసిక రసాస్వాదనతో పాటు సామాజిక పరిస్థితుల ప్రేరణతో రాసిన ఆగ్రహావేశాల ప్రకటనలు కూడా కనబడతాయి. కవిత్వ సృజనకు కారణమైంది సామాజిక ప్రేరణ అయినా, వ్యక్తిగత అనుభూతుల ప్రేరణ అయినా గాని రసస్ఫోరకమైనదే కవిత్వం.

కవిత్వానికి సంగీతానికి దగ్గరి సంబంధం ఉంది. కవిత్వం అర్దవంతమైన సంగీతం. సంగీతానికి భావార్ధాలతో సంబంధం లేదు. కాని కవిత్వం అర్ధావంతమైన పదాలను, భావాలను ప్రకటించే సంగీతం. కవిత్వం ఏదైనా గాని, అది అస్పష్టత నిండిన అధివాస్తవిక కవిత్వమైన, స్పష్టంగా భావావేశాలను ప్రకటించే నిర్దిష్టవాద కవితలైనా, ఆత్మాశ్రయ కవితలైనా గాని పాఠకుడిలో రససిద్ధి కలిగించలేకపోతే వాటి లక్ష్యం నెరవేరదు. కవిత్వ పఠనంలో సౌందర్యానుభవం కలుగకపోతే ఆ కవిత నీరసమే. బూర్ల వెంకటేశ్వర్లు సంపుటిలో అలాంటి కవిత ఒక్కటి కూడా కనిపించదు.

ఈ సౌందర్యానుభవాన్ని నిర్వచించడం కష్టం. ఉషోదయం చాలా అందంగా ఉంటుంది. కాని ఉషోదయం ఎందుకు అందంగా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. ఉషోదయం మన కంటికి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి అనుభూతి కలిగించే సామర్థ్యం లేదా లక్షణం ఉషోదయానికి ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు కూడా జవాబు లేదు. ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి ఉషోదయం అందమైనది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు చిత్రకారుడు ఒక అందమైన ఉషోదయాన్ని చిత్రించి అలాంటి రససిద్ధి కలిగించగలడు. ఒక కవి కూడా తన కవితలో అలాంటి భావచిత్రాన్ని గీయగలడు. కాని చిత్రకారుడి కుంచె కేవలం కంటికి మాత్రమే సౌందర్యానుభవం కలిగిస్తుంది. కవి వాడే పదాల్లోని శబ్ధం, లయ కంటికే కాదు, చెవులకు కూడా సౌందర్యానుభవాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఒక దృశ్యశ్రావ్య చిత్రంగా అద్భుతమైన అనుభూతినిస్తుంది.
ఉషోదయం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. వివిధ భావావేశాల అనుభూతులను కలిగించే సామర్థ్యం కవిత్వానికి ఉంది. ఒక వస్తువు భౌతిక రూపం, దాని గుణలక్షణాల తాత్విక వాతావరణం. ఈ రెండు ఆ వస్తువు ప్రత్యేకతలే. కేవలం భౌతికరూపం మాత్రమే చూపించేది కాదు కవిత్వం. భౌతికరూపం చుట్టు అలుముకుని ఉన్న గుణలక్షణాల తాత్వికతను కూడా కళ్ళ ముందు నిలబెట్టేదే కవిత్వం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు కవి ఒక చిత్రకారుడు మాత్రమే కాదు ఒక శిల్పి కూడా. కవితలో అనేక భావచిత్రాల ద్వారా కలిగించే రససిద్ధి ఒక ఎత్తయితే, మొత్తం కవిత చదివిన తర్వాత మన కళ్ళముందు కదలాడే భావశిల్పం మరో ఎత్తు. ఒక్కోసారి పూర్తి కవితలోని అన్నీ భావచిత్రాలు పాఠకుడి మనోనేత్రాల ముందుకు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కవి రాసిన కొన్ని పదాలకు అర్ధాలు కూడా పాఠకుడికి వెంటనే తట్టకపోవచ్చు. అస్సలు ఆ అర్ధాల గురించి ఆలోచించేన అవసరం కూడా పాఠకుడికి కలుగకపోవచ్చు. ఉదాహరణకు శ్రీ శ్రీ రాసిన  మహాప్రస్థానం కవితలోని ’’వర్షుకాభ్రములు ప్రళయఘోష వలె‘‘ అనే పంక్తి వెంటనే అర్ధం కాకపోవచ్చు. చాలా మందికి వర్షుకాభ్రములంటే ఏమిటో నిఘంటవువు వెదకవలసిన అవసరం కలగవచ్చు. కాని ఆ పంక్తి అర్ధం కాకపోయినా, మహాప్రస్థానంలోని శబ్ధసౌష్ఠవం, పదచిత్రాలు, ఎగసిపడే నిప్పురవ్వల దృశ్యం మన ముందుకు కనబడుతుంది. సమర్ధుడైన కవి రాసిన కవిత చదివిన తర్వాత ఒక స్పష్టమైన భావశిల్పం పాఠకుడి కళ్ళముందు కదలాడుతుంది. బూర్ల వెంకటేశ్వర్లు కవితలు అలాంటి భావశిల్పాలే. ప్రతి శిల్పం అందంగా చెక్కిన కళాఖండం.

ఈ సంపుటిలో తెలంగాణా స్పృహతో రాసిన కవితలు, తెలంగాణా మాండలికంలో రాసిన కవితలు, తెలంగాణా
పల్లెపట్టుల గురించి రాసిన కవితలు బూర్ల వెంకటేశ్వర్లు కు తెలంగాణా పట్ల ఉన్న మమకారానికి నిదర్శనాలు.
ముఖ్యంగా అగ్నిపునీతులు అనే కవిత.  తెలంగాణా పోరాట విజయాన్ని కాంక్షిస్తూ రాసిన ఈ కవితలో అభివ్యక్తిలో కొత్తదనం ఉంది. మనం గెలిచి తీరుతాం అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ సాగిన ఈ కవితలో

’’ కన్నతల్లి ప్రసవానికి
చేతులన్నీ చీరలుగా చుట్టే తీరుతాం!‘‘
’’ కన్నీళ్ళ పరదా మీద స్వేఛ్ఛా పావురాలు ఎగరేస్తూనే ఉంటాం!
మనం గెలిచే తీరుతాం!‘‘
వంటి పంక్తులు గుండెలపై శిలాక్షరాలుగా నిలిచిపోతాయి. తెలంగాణా సాధనను కన్నతల్లి ప్రసవంగాను, ఆ లక్ష్యసాధనకు కలిసిన చేతులను చీరలుగా చుట్టడంగాను చెప్పడం అద్భుతమైన అభివ్యక్తి.
తెలంగాణా పోరాటం పట్ల స్పృహతో రాసిన కవితలే కాదు, తెలంగాణా సంప్రదాయాలు, పల్లెపట్టుల అందాలపై రాసిన కవితలు కూడా సౌందర్యదృష్టికి అద్భుతమైన రససిద్ధి కలిగించే కవితలు.
బతుకుపూలకళ అనే కవితలో తెలంగాణాను పూలతో సింగారించిన వర్ణచిత్రం అత్యద్భుతంగా ఉంది.

’’ నిటారుగ నిల్సున్న ముద్దగౌరమ్మ
తెలంగాణ నిండు ముత్తైదువ‘‘
అంటూ తెలంగాణాను పర్సనిఫై చేస్తూ బతుకమ్మ నేపథ్యంలో రాసిన ఈ కవిత తప్పక చదవవలసిన అందమైన కవిత
’’బతుకుపూలు‘‘ కవితలో పూలతో పోరాటాన్ని వర్ణించిన తీరు అద్భుతంగా ఉంది. ఎన్నీల ముచ్చట్లు, ఎన్నీల వంటి తెలంగాణా స్పృహతో రాసిన కవితలతో పాటు ’గుండెతడి‘‘పేరుతో రాసిన కవిత తెలంగాణా చెరువుల దుస్థితిని సంభాషణాత్మక శైలిలో ఆవేదనను ప్రకటించిన కవిత.

’’ రా తమ్మీ!
చెయ్యిల చెయ్యేసి తెలంగాణ
గుండె తడిని తరతరాలకు నిలుపుకుందాం!  ‘‘
అన్న ముగింపు కంటతడి పెట్టించే ముగింపు.
తెలంగాణాలో రాజకీయాల పరిస్థితిని వ్యంగ్యాత్మకంగా నిరసించిన కవిత ’’కోహినూర్‘‘

’’ రెండు నాల్కల నాగుంబాంమ్మీద
కోహినూర్ వజ్రం
నవ తెలంగాణ‘‘
అంటూ తెలంగాణాలో రాజకీయ పరిస్థితిపై తన ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన అస్తిత్వవాదాన్ని ప్రకటించిన కవిత ’’మేమే‘‘. తెలంగాణా గడ్డపై

’’ పెన్నైనా గన్నైనా
పేల్చింది మేమే కద‘‘
అని నిర్మొహమాటంగా ప్రకటించిన కవిత
నలిమెల భాస్కర్ గురించి రాసిన కవిత ’’నవనీతం‘‘ లో
’’ తెలంగాణ కడుపు సల్లగ జేసిన
పదకోశపు సల్లకుండ‘‘ అని వర్ణించిన తీరులోను తెలంగాణా స్ధానికత పట్ల మమకారం అద్భుతంగా ధ్వనించింది. తెలంగాణా పోరాటతత్వాన్ని, మడమతిప్పని త్యాగనిరతిని, మొక్కువోని సంకల్పబలాన్ని, తెలంగాణా సంస్కృతి సుగంధాన్ని, తెలంగాణా చరిత్ర వారసత్వాన్ని రంగురంగుల పదచిత్రాల్లో గీసిన అద్భుతమైన వర్ణచిత్రం ’’నేను తెలంగాణా‘‘ కవిత.

’’ వేలవీరుల నెత్తుటి నుండి వికసించి
కోటి ఆశల్ని పువ్వులుగా పేర్చి
సగర్వంగా నిలబడ్డ పెద్ద బతుకమ్మను‘‘ అంటూ ముగించిన కవితలోని సౌందర్యదృష్టి ఆకట్టుకుంటుంది. తెలంగాణా పోరాటగాధ కంట తడిపెట్టిస్తుంది. ’’నేటి కల‘‘ కవితలోను అదే తెలంగాణా స్ధానిక స్పృహ, తెలంగాణా భాషా వ్యక్తీకరణలు కనిపిస్తాయి.
ఈ సంపుటిలోని కవితలను పరిశీలిస్తే, బూర్ల వెంకటేశ్వర్లు రాసిన కవితల్లో కధనాత్మక శైలి ఎక్కువగా కనిపించింది. వ్యంగ్యాత్మక ధ్వనితో రాసిన కవితలు కూడా ఎక్కువే. ’’అభివృద్ధి‘‘ అనే కవితలో చివరి వరకు తీవ్రమైన వ్యంగ్యాన్ని ధ్వనిస్తూ, మన అభివృద్ధి నిజరూపాన్ని కళ్లకు కడుతూ చివరన చెప్పిన మాటలు

’’ భంగపడ్డ ఒక జాతి
ఆత్మగౌరవం కోసం
అరవై ఏళ్ళు ఆశగా ఎదురుచూడడం
ఈ దేశానికి ఎప్పటికీ ఒక రికార్డే!
కాదంటావా! ‘‘

పాఠకుడిని ఒక్కసారి కుదిపేస్తాయి. కవిత ఒక భావతరంగం వంటిది. అందులోని అలల్లో శిఖరాలు, లోయలు రెండూ ఉంటాయి. కవితలోని స్టాంజాలు అలలు అలలుగా మనసును తాకుతాయి. ఈ చివరి స్టాంజా ఒక్కసారి సునామీగా ముంచేసేలా రాయడంలో చూపించిన చాకచక్యం గమనించదగింది. కవితలోని స్టాంజాల అమరిక పట్ల, నిర్మాణం పట్ల కవికి బలమైన అవగాహన లేకపోతే చివరి స్టాంజాను ఇంత సరళమైన పదాలతో ఇంత బలంగా రాయడం తేలిక కాదు.
బహిష్కరణలు అనే కవిత కూడా కధనాత్మక శైలిలో రాస్తూ వ్యంగ్యం ధ్వనించిన కవితలో మధ్య మధ్య రాసిన

’’ చిత్రంగా ఊరిలో
ఇంటి వెనుక
కోళ్ళకు, కుక్కలకు, గేదెలకు గుడిసెలుంటాయి‘‘‘

వంటి పంక్తులు తీవ్రమైన ఆవేదనను ప్రతిబింబించాయి. కంటిరెప్పలతో అశ్రుబిందువులను బిగబట్టి, తన పరిస్థితికి పెదాలతో రాని నవ్వును నవ్వుతున్న ఒక బడుగు దీనమైన ముఖం ఈ పదాల వెనుక కనబడుతుంది. వ్యంగ్యాన్ని, సీరియస్ వ్యంగ్యాన్ని బలంగా ప్రకటించిన కవిత ఇది.
’’చీపురు‘‘ కవితలోను వ్యంగ్యమే బలంగా ఉన్నప్పటికీ, వర్తమాన రాజకీయాలు, ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాలపై హాస్యప్రధానమైన వ్యంగ్యం మాత్రమే. కవితల్లో వ్యంగ్యం సీరియస్ నెస్ కోల్పోతే కవిత బలహీనపడుతుందని నా నమ్మకం.
వ్యంగ్యం ప్రధానంగా రాసిన మరో కవిత ’’జై పెట్టుబడిదార్‘‘. నేటి కార్పోరేట్, విదేశీ పెట్టుబడుల రాజకీయాలపై ఆగ్రహప్రకటనగా సాగిన కవిత ఇది. వచన కవితలో ప్రధానమైనది శబ్ధం అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. శబ్ధం అనేది ఛందోబద్దమైన పద్యాలకు, శబ్ధాలంకారంతో రాసే వాటికి మాత్రమే సంబంధించిందిగా చాలా మంది భావిస్తారు. కాని అది నిజం కాదు. కవిత్వానికి భావం ప్రాణమైతే, శబ్ధం శరీరం. మనం మాట్లాడే భాషలో వాడుకలయ ఉంటుంది. ప్రతి వ్యక్తి భాషలో ఒక లయ ఉంటుంది. ఈ లయ సంగీతానికి సంబంధించిన యాంత్రికమైన నిడివిని కొలిచే తాళానికి సంబంధించిన లయ కాదు. ఇది సహజమైన క్రమరహితమైన లయ. తిశ్ర, చతురస్ర గతుల ఖచ్చితమైన నడక దీనికి ఉండకపోవచ్చు. కాని మాట్లాడే భాషకు ఉండే క్రమరహితమైన లయ ఉంటుంది. ముఖ్యంగా యాసల్లో ఈ లయను గుర్తించవచ్చు. ప్రామాణిక భాష కన్నా యాసల్లో లయ ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే వచన కవితను సాధ్యమైనంత వరు మాట్లాడే భాషలో రాయడం ద్వారా ఈ లయను సాధించవచ్చు. ఈ కవితలోను అలాంటి ప్రాసంగిక లయ కనబడుతుంది. ఈ కవిత చాలా స్పష్టంగా, అర్ధం చేసుకోడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రవాహంలా సాగిపోతుంది.

’’ మా నరులే మీకు వనరులు
మా  ప్రజల అవసరాలే మీకు ముడిసరుకులు‘‘
వంటి పంక్తులు చదివితే, అతి స్పష్టమైన వాక్యాలతోను ఎంత బలమైన కవిత్వం రాయవచ్చునో తెలియజేసే కవిత ఇది.
వ్యంగ్యంగా రాసిన మరో కవిత ’’జయం‘‘ తెలంగాణా స్పృహతో రాసిన కవితల్లో ఒకటి. యాస పదాలతో సాగే ఈ కవితలోను ఇలాంటి అద్భుతమైన లయ మనకు కనబడుతుంది. ముఖ్యంగా యాసలో మాట్లాడే భాష వల్ల వచ్చిన ఈ లయతో పాటు,
’’ పచ్చనోట్లు మెడల ఏసి
ప్రజాస్వామ్యం పుస్తెలు తెంపుతుండ్రు‘‘
వంటి వాక్యాల్లోని అభివ్యక్తి గమనించదగింది. ఎన్నికల్లో ఓట్లకు నోట్లనిచ్చే రుగ్మతపై సంధించిన బాణం ఇది. ప్రజాస్వామ్యం పుస్తె తెంపడం, మెడలో పచ్చనోట్లు వేయడం... ఈ రెండు భావాలు చాలా తీవ్రమైన నిరసనను ప్రకటిస్తున్నాయి. ఇంత తీవ్రమైన నిరసనను అత్యంత సున్నితమైన శైలిలో ప్రకటించడం చాలా కష్టం.
బూర్ల వెంకటేశ్వరరావు కవిత్వసంపుటిలో వివిధ వస్తువులపై రాసిన కవితల్లోని వస్తువైవిధ్యం కూడా గమనించదగింది. లేడీ కండక్టరు పేరుతో రాసిన కవితలోని మొదటి వాక్యమే జయహో కవిత్వం అనిపిస్తుంది.
’’ చంకన
ముస్తాబైన టికెట్ల చంటోడు.‘‘
ఎంత అద్భుతమైన ప్రారంభం. పిల్లలను పోషించడానికి, పిల్లల కోసమే సంపాదన. చంకన పిల్లలను ఎత్తుకునే ఆమె పిల్లల కోసమే చంకన టిక్కెట్ల చంటోడిని ఎత్తుకుంది.
ఈ కవిత ప్రారంభం ఎంత అద్భుతంగా ఉందో ముగింపు అంతే అద్భుతంగా ఉంది
’’ ఏమీ దాచుకోలేని నదిలా ఆమె
సంసార సాగరంలో లీనమవుతుంది.‘‘
ఒక లేడీ కండక్టరు జీవితాన్ని కవిత్వీకరించిన తీరు ఒక కవిగా బూర్ల వెంకటేశ్వరరావు పరిణితికి నిదర్శనం.
ఇలాంటి వస్తువైవిద్యంతో రాసిన కవితే ’’కట్టెలు కొట్టేవాడు‘‘. అడవిని నమ్ముకుని బతికే వారు అభివృద్ధి తుఫానులో ఎలా కొట్టుకుపోతున్నారో చాటి చెప్పిన కవిత ఇది.
’’ ఒకప్పుడు అతనికో గుట్టుండేది
గుట్టకో చెట్టుండేది
చట్టబద్దంగా ఇప్పుడు గుట్టలేదు
చెట్టును పొట్టకోసం కూడా కొట్టరాదు
ఇటున్నపుల్ల అటు పెట్టరాని వాడు
అతణ్ణి కట్టెపుల్లను చేశాడు‘‘
అభివృద్ధి అడవిని మింగేస్తున్న వైనాన్ని ఈ కవితలో ప్రకటించిన తీరు ఆలోచింపజేస్తుంది. ఆలిశెట్టి ప్రభాకర్ యాదిలో రాసిన కరోనా వజ్రపుటుంటరం కవిత నిజంగానే వజ్రపుటుంగరం. సూర్యగ్రహణం విడుస్తున్నప్పుడు ప్రారంభంలో క్షణకాలం తళుక్కున మెరిసే కాంతిని కరోనా డైమండ్ రింగ్ అంటారు. ఆలిశెట్టి ప్రభాకర్ను కరోనాగా వర్ణించడంలోనే బూర్ల వెంకటేశ్వర్లు కవిత్వ ప్రతిభ తెలుస్తోంది.
’’ పెత్తందారి మేడల మీద
అరిపోని రక్తరేఖ
దళారీ సంస్కృతి ముఖాన
నాటిన వాగ్బాణం‘‘
అంటూ ఆ గ్రహణం విడివడే ముందు క్షణకాలం కనబడే కరోనాగా ఆలిశెట్టి ప్రభాకర్ను వర్ణించడం చాలా సహజంగా ఉంది.
వరిచేను వాని కంటి కాటుక అంటూ రైతు గురించి రాసిన కవితగాని, వాళ్ళూ వీళ్ళు పేరుతో మహిళల గురించి చక్కని లయతో రాసిన కవితగాని, ఉత్తరానివాళ్ళు పేరుతో బియాస్ నదిలో మరణించిన వారి కోసం రాసిన కవిత కాని కవితాత్మక ప్రతిస్పందనలకు ఉత్తమ ఉదాహరణలనదగ్గ కవితలు.
ముంబయి ప్రయాణానుభవం కవిత్వీకరించిన ’’ఒక పన్నీరు..ఉబికే కన్నీరు‘‘, వాలంటైన్స్ డే పై రాసిన ప్రేమ కోసం ఒక రోజు కవిత, ముద్దులపై రాసిన ’’రంగులేని ముద్దులు, మతం లేని కౌగిళ్ళు‘‘ కవిత ఈ సంపుటిలోని వస్తువైవిధ్యానికి నిదర్శనాలు
స్వచ్ఛమైన కవిత్వం ’’పల్లెతల్లి‘‘ కవితలో కనిపిస్తుంది. వర్ణనాత్మకమైన ఈ కవిత అద్భుతమైన పదచిత్రాలతో పరవశం కలిగిస్తుంది.
’’ పసిపిల్లలకు పాలు పడుతూ
కొంగు కప్పిన తల్లిలా
ప్రతీ పల్లె
ఈ దేశం మీద వాలిన
తెల్ల పక్షుల గుంపు‘‘
మనసు దూదిపింజలా హాయిగా తేలిపోయే ఇమేజరీతో రాసిన కవిత ఇది.
ఇలాంటి అద్భుతమైన కవితలెన్నో ఉన్న కవిత్వ సంపుటి...
బూర్ల వెంకటేశ్వరరావు ఇలాంటి మరిన్ని సంపుటులు తెలుగు కవితా ప్రియులకు కానుకగా ఇవ్వాలని, తెలుగు సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసే కవిత్వం ఆయన నుంచి రావాలని మనసారా కోరుకుంటున్నాను.
~యాకూబ్
అగష్టు 7, 2015

1 comment:

  1. అన్నా!మీ ప్రోత్సాహ వాక్యాలు నన్నిలా నడిపిస్తున్నాయి... ముందు మాట ఒకటి వెనుక మాట ఒకటి లేదు కనుకనె మీ మాటలు కవిత్వాన్ని నిలబెడుతున్నాయి... Thanks చెప్పదు చిన్న మాట...ఉంటా...

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...