అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

22 Aug 2013

కలవంటి మరణం

త్రిశ్రీ చనిపోయాక నివాళిగా ఒక కవిత 10.11.96 లో రాసాను. నా 'సరిహద్దు రేఖ'[పుట .78,79]లో ప్రచురించాను.


....................

చెట్లు ఎండిన అశ్రువుల్ని రాల్చాయి
మేఘం ఇది చూసి కలవరపడి ఉంటుంది 
మరణాన్నే బహుశా ఇది సంశయానికి గురిచేసి ఉంటుంది.

కలవంటి మరణం 
మరణం వంటి కల 
కలకూ,జీవితానికీ చివరికంటా తెగని ప్రశ్న 

తల పగిలి కలలన్నీ భళ్ళున రాలి చెల్లచెదురై పోయుంటాయి 
కాగితాలకేత్తేవాళ్ళెవరూ ఆ దారిలో సంచరించి ఉండరు.

అక్షరాలవంటి జ్ఞాపకాలు 
జ్ఞాపకాలవంటి అక్షరాలు 

అక్షరాలే ఇప్పుడు ఇక అతడి రూపం 
వర్షంలా,రోడ్డులా,నీడలా మరణమే ఇక అతని వెంట నడుస్తుంది 

1

అన్నిటికీ మించి జీవించడమే గొప్ప వరం 
అన్ని రహాస్యాలు అక్కడే దాగి ఉంటాయి 
దేహం రహస్యాల ఖని 
లోపల తవ్వుకుని,అక్షరాలుగా రాసిపోసేందుకే 
ఎప్పటికప్పుడు శ్రమించాలి ,అవైనా మరణాన్ని జయిస్తాయి.

కలల్ని జయించేందుకే అతడు జీవించాడు 
కలలే అతడిని ఇంకా బతికిస్తాయి 
కలల్ని కనే వాళ్లందరూ చిరంజీవులు ,అతని కలల్లో మచ్చుకి ఒకటి :
"వస్తూనే అనుకున్నాను కొత్తగా వద్దు 
పాతగానే మాట్లాడుదామని 
కొన్ని కొత్త సంగతులను 
పాతగా చెబితేనే కొత్తగా అర్థమవుతాయి"

మరణాన్ని కలగా మార్చినవాడు 
స్వప్నాలకు గజ్జెలు కట్టినవాడు
'హో' అన్నవాడు,రహాస్యోద్యమకారుడు ,అక్షరాలకు ఆగ్రహం నేర్పినవాడు,దళితవాదం 
సంధించినవాడు,'కవిత్వం ప్రచురణ'య్యినవాడు 
'యికలేడు' అని అంత తొందరగా తేల్చవద్దు! 

అతడిది 
"ఒక ప్రారంభం కోసం 
ఒక ముగింపు నిరీక్షణ"

[త్రిపురనేని శ్రీనివాస్ జ్ఞాపకానికి]

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...